టీడీపీ మహానాడు ఫుడ్ మెనూ చూస్తే నోరూరి పోవాల్సిందే..

నేడు , రేపు రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు వేడుకలు జరగబోతున్నాయి. గతంలో 2006లో ప్రభంజనంలా నిర్వహించిన మహానాడు తరహాలోనే తిరిగి మళ్లీ అదే ప్రాంతంలో మహానాడు పండగ జరపబోతున్నారు. ఇక ఈ మహానాడుకు వచ్చే అతిథుల కోసం టీడీపీ నోరూరించే ఫుడ్ మెనూ సిద్దం చేసింది. ఫుడ్ కమిటీ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జ్యోతుల నెహ్రూలు మెనూ సిద్ధం చేశారు. తొలిరోజు లక్ష మంది, రెండోరోజు 15లక్షల మంది వచ్చే అవకాశం ఉందని.. వారందరికి ఏర్పాట్లు చేశారు.
శనివారం (27న) మహానాడు ప్రతినిధుల సభకు వచ్చేవారికి టిఫిన్ మెనూలో.. ఇడ్లీ, వడ, పొంగల్, టమాటా బాత్, పునుకులు, మైసూర్ బజ్జీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబారు వడ్డిస్తారు. శనివారం మధ్యాహ్నం, రాత్రి భోజనంలో.. స్వీట్లలో కాకినాడ కాజా, తాపేశ్వరం గొట్టం కాజా, యాపిల్ హల్వా, జిలేబీ వడ్డిస్తారు. వెజ్ బిర్యానీ, బంగాళదుంప కుర్మా, పెరుగు చట్నీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, బెండకాయ వేరుశనగ, మామిడికాయ పప్పు, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, గుత్తి వంకాయ, గోంగూర, టమాటా మునక్కాయ, మామిడికాయ ఆవకాయ, దోస ఆవకాయ, సాంబారు, మజ్జిగ పులుసు, పెరుగులు ఉన్నాయి.
ఆదివారం (మే 28న) బహిరంగ సభ ఉంది.. పది లక్షల మందికి పైగా వస్తుండటంతో.. శనివారం ఉదయం మెనూనే కొనసాగిస్తున్నారు. కాకపోతే మధ్యాహ్నం, రాత్రి భోజనంలో మార్పులు చేశారు. మెనూలో.. సాంబారు రైస్, చక్కెర పొంగలి, పెరుగన్నం పెడతారు. భోజనాల దగ్గర ఏకంగా 10 లక్షల నీటి సీసాలు, 10 లక్షల మంచినీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం తాపేశ్వరం నుంచి 30 వేల కాజాలు సిద్ధం చేశారు.