చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన 5 మంది మృతి..

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా..అందులో ఆరు నెలల చిన్నారి కూడా ఉండడం అందర్నీ శోకసంద్రంలో పడేసింది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కుటుంబం.. 5 నెలల చిన్నారి మొక్కు తీర్చేందుకు షిఫ్ట్​ కారులో తిరుపతికి బయలుదేరారు. సోమవారం శ్రీవారి దర్శనం ఉండటంతో కాణిపాకంలోని సిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకొని.. అక్కడ్నుంచి తిరిగి ప్రయాణం అయ్యారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఉన్న పుతలపట్టు – నాయుడుపేట జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో చిన్నారి సహా ఐదుగురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని తిరుపతి రుయాకు తరలించారు.