పాకిస్తాన్లో పేలుడు.. ఐదుగురు మృతి
పేలుడును తీవ్రంగా ఖండిస్తున్న..ప్రధాని ఇమ్రాన్
క్వెట్టా : పాకిస్తాన్లోని చమన్ నగరంలో నిర్మాణంలో ఉన్న భవనం సమీపంలో సోమవారం జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి. నగరంలోని మాల్ రోడ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనానికి పేలుడు పరికరం (ఐఈడీ) అమర్చి బ్లాస్ట్కు పాల్పడ్డారని ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది. పేలుడు జరుగడంతో సమీపంలోని మెకానిక్ దుకాణం పూర్తిగా ధ్వంసమైంది. భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు. అయితే ఈ బ్లాస్ట్ ఎవరు, ఎందుకు చేశారో అనే అంశంపై ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం చమన్ పేలుడును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/