తెలంగాణ విద్యుత్ శాఖలో జూనియర్ లైన్‌మెన్ పేపర్ లీక్ : ఐదుగురు అధికారుల సస్పెన్షన్‌

తెలంగాణ విద్యుత్ శాఖలో జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్రశ్నాపత్రం లీక్ కేసులో ఐదుగురు విద్యుత్‌ అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేల్చిన ప్రభుత్వం ..వీరిని సస్పెండ్‌ చేసింది. అందరి కళ్లుగప్పి హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కో అభ్యర్థి నుంచి 5 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని ఇదంతా చేసినట్లు తేలింది. అడ్వాన్స్‌గా ఒక్కో అభ్యర్థి నుంచి లక్ష రూపాయల చొప్పున తీసుకున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

జూనియర్ లైన్‌మెన్ ఖాళీల భర్తీ కోసం జూలై 17న పరీక్ష జరిగింది. శివప్రసాద్ అనే ఎలక్ట్రీషియన్ ఈ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష హాల్లోకి అతడు సెల్ ఫోన్‌తో వచ్చాడు. నిందితులు మైక్రో ఫోన్ ద్వారా అతడికి సమాధానాలు చేరవేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. విద్యుత్ శాఖలో ఏడీఈగా పనిచేస్తున్న ఫిరోజ్ ఖాన్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సైదులు, సబ్ ఇంజనీర్ షేక్ షాజాన్.. అభ్యర్థులకు మైక్రోఫోన్ ద్వారా సమాధానాలు చెప్పినట్లు పోలీసులు తేల్చారు. దీంతో మొహమ్మెద్ ఫిరోజ్ ఖాన్, సపావత్ శ్రీనివాస్, కేతావత్ దస్రు, షైక్ సాజన్, మంగళగిరి సైదులను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది.