తమిళనాడు రామేశ్వరంలో దారుణం : సామూహిక అత్యాచారం చేసి.. చంపేశారు

దేశంలో మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. ప్రతి రోజు పదుల సంఖ్యలో అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కోర్ట్ లు , ప్రభుత్వాలు , పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్న కామాంధుల్లో మార్పు , భయం రావడం లేదు. తాజాగా తమిళనాడు రామేశ్వరంలో దారుణం చోటుచేసుకుంది. 45 ఏళ్ల మహిళపై ఒడిశాకు చెందిన ఆరుగురు వలస కార్మికులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆపై ఆమెను చంపి, మృతదేహాన్ని తగలబెట్టారు. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకునేలా చేసింది.

పోలీసులు తెలిపిన ప్రకారం..రామేశ్వరంలోని వడకాడు మత్స్యకార గ్రామంలో మంగళవారం ఉదయం చేపల కోసం బాధితురాలు వెళ్లింది. చాలాసేపు అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే గ్రామంలో ఉన్న రొయ్యల ఫామ్‌లో ఓ మహిళ మృతదేహం పాక్షికంగా కాలిపోయి పడి ఉందని పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి పరిశీలించారు.

అది బాధితురాలి మృతదేహం అని తేల్చారు.ఆ సమయంలోనే బాధితురాలి హత్యాచారంలో ఆరుగురు వలస కార్మికుల ప్రమేయం ఉందని తెలుసుకున్న గ్రామస్థులు వారిని చితక్కొట్టారు. అనంతరం బాధితురాలికి న్యాయం చేయాలంటూ రామేశ్వరం జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న ఆరుగురు వలస కార్మికులను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.