చేపల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా..చేపల కోసం జనాలు పరుగులు

అసలే ధరలు మండిపోతున్నాయి. ఏం కొనాలన్నా..ఏం తినాలన్న ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో మనకు కావాల్సినవి ఫ్రీగా వస్తున్నాయంటే ఉరుకుంటామా..అందులోనూ ఎంతోఇష్టంగా తినే చేపలు దొరికితే వదిలిపెడతామా. తాజాగా అదే జరిగింది. చేపల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడడంతో జనాలంతా చేపల కోసం పోటీపడ్డారు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. కర్ణాటక నుంచి వెస్ట్ బెంగాల్‌కు చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు కావడంతో పోలీసులు వారిని జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు.

చేపల లారీ బోల్తా పడింది అని తెలుసుకున్న వారంతా పరుగుపరుగున వచ్చి చేపలను తీసుకెళ్లడం మొదలుపెట్టారు. గుంపులుగుంపులుగా జమ కూడిన జనాలు చేపల కోసం ఎగబడ్డారు. ఒకరకంగా చెప్పాలంటే చేపల కోసం ఒక చిన్నపాటి యుద్ధమే చేశారు. ఒక్క అరగంటలోనే లారీలో ఉన్న లోడు చేపలు అన్నింటిని మాయం చేశారు. ఇక చేపల కోసం ఎగబడుతున్న జనాలను కట్టడి చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారడంతో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితిలో చేతులెత్తేశారు. సంచులు తెచ్చుకొని మరీ ఒక్కొక్కరు కిలోల కొద్దీ చేపలను ఎత్తుకెళ్లారు. ఇక బాగా చేపలు దొరికిన వారి ముఖాలు కళకళలాడాయి. ఇక టూ వీలర్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా వాహనాలను ఆపి మరీ చేపలను ఎత్తుకెళ్లారు.