భారత సైన్యంలోకి చేరిన కరోనా తొలి కేసు
లద్దాఖ్ స్కౌట్స్ లో పని చేస్తున్న జవానుకు కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దేశంలో రోజురోజుకు విజృంభిస్తుంది. ఈమహమ్మారి తాజాగా భారత సైన్యానికి కూడా విస్తరించింది. ఇండియన్ ఆర్మీలో తొలి కేసు నమోదైంది. లద్దాఖ్ స్కౌట్స్ (స్నో వారియర్స్) విభాగానికి చెందిన ఒక జవానుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనను క్వారంటైన్ కు తరలించారు. ఫిబ్రవరి 27న సదరు జవాను తండ్రి ఇరాన్ నుంచి వచ్చారు. ఈ సందర్భంగా సాధారణ సెలవుపై ఇంటి వద్ద ఉన్న జవాను తన తండ్రితో గడిపారు. జవాను తండ్రిని ఫిబ్రవరి 29 నుంచి క్వారంటైన్ చేశారు. ఆయనకు కరోనా పాజిటివ్ అనే విషయం మార్చి 6 తెలిసింది. ఆ మరుసటి రోజు సదరు జవానును కూడా ఐసొలేషన్ కు తరలించారు. ఆయనకు కూడా కరోనా పాజిటివ్ అనే విషయం గత సోమవారం తెలిసింది. దీంతో, ఆయనను కూడా క్వారంటైన్ చేశారు. ఆయనతో పాటు ఆయన భార్య ఇద్దరు పిల్లలు, ఒక సోదరిని కూడా ఓ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కు తరలించారు. కాగా దేశంలో ఇప్పటి వరకు 147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/