ఏపీలో మొదటిరోజు 5 లక్షల మంది బాలబాలికలకు టీకా పంపిణీ

సోమవారం దేశ వ్యాప్తంగా 15-18 ఏళ్లలోపు మధ్యనున్న టీనేజర్లకు కరోనా టీకాలు పంపిణీ చేసారు. ఇప్పటి వరకు పెద్దలకు ఇస్తున్నట్టుగానే వీరికి కూడా 0.5 మిల్లీ లీటర్ల మోతాదులో టీకా వేస్తారు. తొలి డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత అంటే 28 రోజులకు రెండో డోసు వేస్తారు. ఈ క్రమంలో ఏపీలో మొదటి రోజు 5 లక్షల మంది బాలబాలికలకు టీకా పంపిణీ జరిగింది. రాష్ట్రంలోని 6454 కేంద్రాల్లో టీకా ఇచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కార్యక్రమం ఈ నెల 7వ తేదీ వరకు జరగనుంది.

కొవాగ్జిన్‌ టీకా పంపిణీ గ్రామ/వార్డు సచివాలయాల కేంద్రంగా జరుగుతోంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 72,146 మంది పిల్లలకు టీకా వేశారు. కృష్ణా జిల్లాలో ఉదయం 8 గంటల నుంచి టీకా పంపిణీ ప్రారంభమైంది. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో 40వేల మందికి చొప్పున వేశారు. జిల్లా అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. మరో పక్క దేశవ్యాప్తంగా తొలిరోజు 41 లక్షల మందికిపైగా టీకా తీసుకున్నారు.