మంటల్లో మసైన రూ.75 లక్షల పసుపు

Fire catches load lorry
Fire catches load lorry

నిజామాబాద్‌: ఎండనకా! వాననకా! ఎంతో కష్టపడి ఆరుగాలం చెమడోడ్చి పండించిన పంట చేతికొచ్చి, అమ్ముకునేలోపే అది అగ్ని ఆహుతైపోయింది. తన పంటంతా మంటల్లో కాలిపోతుంటే ఆ రైతు కష్టం వర్ణనాతీతం. పండించిన పంటను మార్కెట్‌కు తరలించేందుకు పది మంది రైతన్న కలిసి ఓ లారీ మాట్లాడుకుని, పసుపు బస్తాలన్నీ అందులో లోడ్‌ చేయించుకున్నారు. లారీ బయల్దేరిన కాసేపటికే వారి ఆశలు ఆవిరైపోయాయి. లారీ డీజిల్‌ ట్యాంకు వద్ద లీకై, మంటలు వ్యాపించడంతో పసుపంతా అగ్గిపాలైంది. దాదాపు రూ.75 లక్షల విలువ చేసే పసుపు మంటల్లో మసైంది. లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ కూడా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

మెండోరా మండలం వెల్గటూర్‌కు చెందిన రైతులు.. తాము పండించిన పసుపును నిజామాబాద్‌లోని మార్కెట్‌ యార్డుకు లారీలో తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. సరుకు ఎక్కించుకొని లారీ తీసుకెళ్తుండగా.. ముప్కాల్ మండలం కొత్తపల్లి శివారులో లారీలో మంటలు అంటుకున్నాయి. లారీలో ఉన్న మొత్తం పసుపు బస్తాలతో పాటు.. లారీ కూడా పూర్తిగా కాలిపోయింది. లారీలో ఉన్న డ్రైవర్ సుధాకర్, క్లీనర్ అజయ్ కూడా మంటలు తాకి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కాయకష్టం చేసి, చెమటోడ్చి పండించిన పంట కళ్లముందే మసై పోతుంటే రైతన్న కన్నీరు ఆగలేదు. లారీలో మొత్తం 350 బస్తాలు ఉండగా, ఒక్కో బస్తా రూ.5 వేల విలువ చేస్తుందని రైతులు వెల్లడించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/