మోడీ పాలనలో వంట గదుల్లో మంటలు పుడుతున్నాయని కేటీఆర్ ఫైర్

వంటగ్యాస్ ధరలు పెంచడం ఫై మంత్రి కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసారు. నిన్న తన ట్విట్టర్ లో ‘మంచి రోజులు వచ్చేశాయ్‌.. అందరికి శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్‌ లిండర్‌ ధరను కేంద్రం మరో రూ.50 పెంచేసింది. సిలిండర్‌ ధర పెంచి మహిళలకు ప్రధాని మోదీ కానుకగా ఇచ్చేశారు’ అని ట్వీట్ చేసిన కేటీఆర్..ఈరోజు మరోసారి గ్యాస్ ధరల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

గడియకోసారి పెరుగుతున్న గ్యాస్‌ ధరతో దేశ ప్రజలకు గుండె దడ వస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మోడీ పాలనలో వంట గదుల్లో మంటలు పుడుతున్నాయని వ్యాఖ్యానించారు. మోనార్క్‌ మోడీ రాజ్యంలో కుటుంబ బడ్జెట్‌లు తలకిందులయ్యాయని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం ధరలు పెంచి దేశ ప్రజలపై దొంగదాడి చేస్తోందని ఆరోపించారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్య పాలనలో దేశం ఉందని పేర్కొన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన టిఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలనా విధానాలపై నిరంతర పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

తాజాగా చమురు సంస్థలు గృహావసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌పై రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1055 నుండి రూ.1105కు చేరింది. తాజా పెంపుతో ఢిల్లీలో రూ.1003గా ఉన్న సిలిండర్‌ ధర రూ.1053కు చేరింది. సాధారణంగా ప్రతి నెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరను చమురు సంస్థలు రూ.183.50 మేర తగ్గించి ఇప్పుడు గృహావసరాల గ్యాస్‌ ధర పెంచడం గమనార్హం. ఇప్పటికే నిత్యావసర ధరలు , పెట్రోల్ ధరలు , బస్సు చార్జీలు , కరెంట్ చార్జీలు ఇలా ప్రతిదీ భారీగా పెరిగాయని సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతుండగా..ఇప్పుడు చమురు సంస్థలు గ్యాస్ ధరను సైతం పెంచడం ఫై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజానీకం ఫై ఈ బాదుడు ఏంటి అని ప్రశ్నింస్తున్నారు. ఇలా పెంచుకుంటూ పొతే ఎలా బ్రతకాలని , కుటుంబాన్ని ఎలా పోషించాలని అడుగుతున్నారు.