పంజాబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..ఏడుగురి సజీవ దహనం

ఓ గుడిసెలో కుటుంబ స‌భ్యులు నివ‌సిస్తుండ‌గా మంట‌లు

లుథియానా : పంజాబ్‌లోని లుథియానాలో తీవ్ర విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ రోజు తెల్ల‌వారుజామున తాజ్‌పూర్‌ రోడ్డులోని ఓ గుడిసెలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుని దంపతులు సహా ఐదుగురు చిన్నారులు సజీవ ద‌హ‌న‌మ‌య్యారు. వారంతా నిద్రిస్తుండగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. మృతుల్లో దంప‌తులు, వారి నలుగురు కుమార్తెలు, కుమారుడు (1) ఉన్నార‌ని చెప్పారు.

ఆ స‌మ‌యంలో వేరే ప్రాంతంలో వీరి మరో కుమారుడు రాజేశ్‌(17) నిద్రించ‌డంతో అత‌డు ఒక్కడే ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలడ‌ని వివ‌రించారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు అగ్ని ప్ర‌మాదంపై సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేలోపే ఆ కుటుంబ స‌భ్యులు మృతి చెందార‌ని అన్నారు. అగ్ని ప్ర‌మాదం ఎలా చోటు చేసుకుంద‌న్న విష‌యంపై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/