రణబీర్ కపూర్ మూవీ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కొత్త చిత్ర షూటింగ్ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రణబీర్ కపూర్ – శ్రద్దా కపూర్ జంటగా లవ్ రంజన్ డైరెక్షన్లో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్ర షూటింగ్ ముంబయిలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలోని చిత్రకూట్ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరుగుతుంది. ఈ క్రమంలో సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది.

స్టూడియోలో ప్లాస్టిక్, థర్మాకోల్‌తో కూడిన సెట్‌ ఉండడంతో మంటలను ఆర్పడం కష్టంగా మారింది. సుమారు 12కి పైగా అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి తీవ్రంగా శ్రమించడంతో ఎట్టకేలకు అవి అదుపులోకి వచ్చాయి. సెట్స్‌లో ప్రీ లైటింగ్ వర్క్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. లవ్ రంజన్ తన సినిమాలోని ఒక పాటను ఇక్కడ చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ ప్రమాదంలో షూటింగ్‌ సిబ్బంది మనీశ్‌ దేవాశీ(32) మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో హీరోహీరోయిన్లు అక్కడ లేకపోవడం వారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన లవ్ రంజన్ సెట్ పక్కనే రాజశ్రీ ప్రొడక్షన్స్‌కు చెందిన మరో రెండు సెట్లు ఉన్నాయి. సన్నీ డియోల్ కుమారుడు, నటుడు రాజ్‌వీర్ డియోల్ ఆ సమయంలో అదే సెట్లో షూటింగ్‌లో ఉన్నాడని అంటున్నారు. మంటలు వారి సెట్‌లకు కూడా చేరుకునేంత తీవ్రంగా ఉండడంతో షూటింగ్‌ను అప్పటికప్పుడు నిలిపివేసి వారందరినీ ఖాళీ చేయించారు.