ముగిసిన నిరసనలు..స్వస్థలాలకు వెళ్తున్న అన్నదాతలు
కొత్త సాగు చట్టాల రద్దుతో ఫలించిన రైతుల పోరాటం
మద్దతు తెలిపిన వారిని కలుస్తామన్న టికాయత్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కొనసాగించిన పోరాటం ఫలించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆ చట్టాలను ఉపసంహరించుకోవడంతో 15 నెలల ఆందోళనలను రైతులు విరమిస్తున్నారు. ఘాజిపూర్, సింఘూ, టిక్రీ బోర్డర్లను విడిచి రైతులు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. సింఘూ బోర్డర్ వద్ద వేసిన టెంట్లను రైతులు తొలగించారు. అలాగే, టిక్రి బోర్డర్ వద్ద రైతులు సంబరాలు జరుపుకున్నారు. అక్కడి నుంచి కూడా టెంట్లను తీసేశారు. ఇక, ఘాజీపూర్ బోర్డర్ వద్ద కూడా రైతులు ఆందోళనలు విరమిస్తున్నారు.
ఈ సందర్భంగా బీకేయూ నేత రాకేశ్ టికాయత్ మీడియాతో మాట్లాడుతూ… తాము ఆందోళన చేసిన సమయంలో మద్దతు తెలిపిన వారిని కలుస్తామని చెప్పారు. ఈ నెల 15వ తేదీన ఈ ప్రాంతం నుంచి మొత్తం ఖాళీ చేసి స్వస్థలాలకు వెళ్తామని తెలిపారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/