రైతుల నిరసనలతో జాతీయ భద్రతకు ముప్పు
కేంద్రం, రైతులు ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలి..సిఎం అమరీందర్ సింగ్

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు, కేంద్రం మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు తన పాత్ర ఏమీ లేదని, కేంద్ర హోంశాఖ మంత్రి వద్ద తన నిరసన వ్యక్తం చేసినట్లు అమరీందర్ తెలిపారు. అయితే రైతు ఆందోళనల వల్ల తమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని, అంతేకాకుండా రైతు నిరసనలతో జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని పంజాబ్ సిఎం హెచ్చరించారు. కేంద్రం, రైతులు ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలన్నారు.
మరో వైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేందర్ సింగ్ తోమర్ .. విజ్ఞాన్ భవన్లో రైతు సంఘాల నేతలతో చర్చలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై రైతులు చర్చలు నిర్వహించడం ఇది నాలుగవసారి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/