నటి కంగనకు యూపీ సీఎం అరుదైన బహుమతి

శ్రీరామచంద్రుడి నాణేన్ని బహుమతిగా ఇచ్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్

లక్నో: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా కంగన ఈ విషయాన్ని వెల్లడించారు. కంగన నటిస్తున్న తేజస్ సినిమా షూటింగ్ మొరాదాబాద్‌లో జరిగింది. షెడ్యూల్ పూర్తయిన అనంతరం లక్నో వచ్చిన కంగన ముఖ్యమంత్రి యోగిని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. తన చిత్ర బృందానికి సాయం చేసినందుకు గాను ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా యోగి ఆమెకు అరుదైన బహుమతిని అందజేశారు. అయోధ్యలోని రామమందిర నిర్మాణం కోసం భూమి పూజలో ఉపయోగించిన శ్రీరామచంద్రుడి నాణేన్ని ఆమెకు బహుమతిగా అందించారు.

యోగితో దిగిన ఫొటోలను, ఆయన అందించిన బహుమతిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన కంగన.. యోగిపై ప్రశంసలు కురిపించారు. అప్పట్లో శ్రీరామచంద్రుడిలానే ఇప్పటి యోగి పాలిస్తున్నారని కితాబునిచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి విజయం సాధించాలని కంగన ఆకాంక్షించారు. కాగా, ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్’ కార్యక్రమానికి కంగనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/