చౌటుప్పల్ లో అనుకున్న మెజార్టీ రాలేదు : రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నిక​ కౌటింగ్ నడుస్తుంది. బిజెపి – టిఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ నడుస్తుంది. మొదటి రౌండ్ లో టిఆర్ఎస్ ఆధిక్యం కనపరిస్తే..రెండు , మూడు , నాల్గు రౌండ్ లలో బిజెపి ఆధిక్యం కనపరిచింది. కానీ మొత్తం నాల్గు రౌండ్ లలో మాత్రం 613 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్ ఉంది.

చౌటుప్పల్ మండలంలో తాము అనుకున్న మెజార్టీ రాలేదని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకైతే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందన్న ఆయన.. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయని చెప్పారు. చివరి వరకు హోరాహోరీ పోరు తప్పక పోవచ్చని అభిప్రాయపడ్డారు. బీజేపీ గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

మరోపక్క కాంగ్రెస్ పార్టీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. ఇప్పటి వరకు నాల్గు రౌండ్లు పూర్తి కాగా..ఈ నాల్గు రౌండ్లలో టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ రౌండ్ లోను ఆధిక్యం చూపించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆశించినంత ఫలితం రాకపోవడంతో.. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యారు.

ఇక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కేఏ పాల్.. నోటాకు పోలైన ఓట్లతో పోటీ పడుతున్నారు. తొలి, రెండో రౌండ్‌లో కేఏ పాల్‌కు 34, 35 ఓట్లు పోల్ కాగా, నోటాకు 29, 53 ఓట్లు పోలయ్యాయి. కేఏ పాల్‌కు పోలైన ఓట్ల వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.