అంబేద్కర్ , ఓయూ పరిధిలో పరీక్షలు వాయిదా
భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు పరీక్షలకు వాయిదా పడగా, ఇక ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తో ఓటు ఓయూ యూనివర్సిటీలోని పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. గురు, శుక్రవారాల్లో జరగాల్సిన పీజీ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఇక రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పలు యూనివర్సిటీల పరిధిల్లో రేపట్నుంచి శనివారం వరకు జరిగే పలు పరీక్షలను వాయిదా వేశారు.
అలాగే జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో పలు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. బీటెక్, బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు, మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ సెకండ్ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వాయిదా పడ్డ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. జులై 21 నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు.
ఇక రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, రిజర్వాయర్లు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యేలను వర్షాలు తగ్గే వరకు నియోజకవర్గాల్లోనే ఉండాలని , ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.