‘మీలో ఎవరు కోటీశ్వరులు’ రేటింగ్ అదిరిపోయింది
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎన్టీఆర్. కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు బుల్లితెర ఫై కూడా తనకు తానే అని నిరూపించుకున్నాడు. బిగ్బాస్ వంటి రియాలిటీ షోను తెలుగు ప్రేక్షకులకు మొదటగా పరిచయం చేసింది ఎన్టీఆరే. ఈయన హోస్ట్గా ఈ షోను తనదైన శైలిలో సూపర్ హిట్ చేసారు. ఇక ఇప్పుడు జెమినీ టీవీ లో ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షో కు హోస్ట్ గా చేస్తున్నారు. గతంలో స్టార్ మాలో ప్రసారమైన ఈ షో హక్కులను ఇప్పుడు జెమినీ టీవీ సొంతం చేసుకుంది. మా టీవీలో మూడు సీజన్లకు నాగార్జున, నాలుగో సీజన్ కు మెగాస్టార్ హోస్టుగా వ్యవహరించారు. ఆ తర్వాత స్టార్ మా ఆ షోను నిలిపేసింది. ఇప్పుడు జెమినీ టీవీ కొత్తగా జూనియర్ ఎన్టీఆర్ తో లాంచ్ చేసింది.
తొలి ఎపిసోడ్ కు రామ్ చరణ్ రావడంతో ఈ షోపై హైప్ పెరిగింది. అటు నందమూరి, ఇటు మెగా అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. దీంతో.. ఈ షోకు భారీ రేటింగ్ వచ్చింది. అంతకు ముందు నడిచిన సీజన్లకన్నా భారీగా రేటింగ్ వచ్చింది. ఆగస్టు 22, 23 తేదీల్లో ప్రసారమైన ఎపిసోడ్ కు 11.40 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది ఎవరు మీలో కోటీశ్వరుడు షో చరిత్రలోనే అత్యధిక రేటింగ్ అని చెపుతున్నారు. తొలి సీజన్ కు అత్యధికంగా 9.70 రేటింగ్ వచ్చింది. రెండో సీజన్ కు 8.20, మూడో సీజన్ కు 6.72 రేటింగ్ వచ్చింది. చిరంజీవి నడిపించిన నాలుగో సీజన్ కు మాత్రం 3.65 శాతమే రేటింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్న షో కు మాత్రం అదిరిపోయే రేటింగ్ వచ్చి..షో యాజమాన్యాన్ని సంబరాలకు గురి చేస్తుంది.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం చరణ్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.