ఈటల బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు

13న బీజేపీలోకి ఈటల రాజేందర్

హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీకి, రాజీనామా చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఈ నెల 13న బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. 13న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. ఈటలతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మాజీ నేత తుల ఉమ తదితరులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల బీజేపీలో చేరుతారన్న ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టుగానే ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలిసి చర్చించారు. అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఆయన గత శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి పార్టీతో తనకున్న 19 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్నారు. 8, లేదంటే 9వ తేదీల్లో బీజేపీలో చేరుతానని ప్రకటించారు. అయితే, తాజాగా 13న బీజేపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/