రేపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నఈటల!

రేపు భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన

హైదరాబాద్: టీఆర్ఎస్ అగ్రనేత ఈటల రాజేందర్ రేపు (శుక్రవారం) తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. అనంతరం 8 లేదా 9వ తేదీల్లో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. ముందు ఎమ్మెల్యే పదవికి, ఆ తర్వాత టీఆర్ఎస్‌కు ఈటల రాజీనామా చేస్తారని, ఆ తర్వాత మంచి రోజు చూసుకుని బీజేపీలో చేరుతారని సమాచారం.

కాగా, బీజేపీలో చేరికకు ఇప్పటికే సిద్ధమైన ఈటల.. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్‌ను, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి చర్చించారు. తనతోపాటు కాషాయ కండువా కప్పుకోబోతున్న ఏనుగు రవీందర్‌రెడ్డి.. తరుణ్ చుగ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో కలిసి బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో నిన్న సాయంత్రం భేటీ అయ్యారు.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/