ఓటమి భయంతోనే టీఆర్ఎస్ వాళ్లు తమపై దాడులకు పాల్పడుతున్నారు – ఈటెల

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మరికొద్ది సేపట్లో ముగుస్తుందన్న క్రమంలో బిజెపి – టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువురు పరస్పరం రాళ్లు , కర్రలతో దాడి చేసుకున్న ఘటన మునుగోడు మండలం పలివెల గ్రామంలో చోటుచేసుకుంది. పలివెల గ్రామంలో ఈటల రాజేందర్‌ ప్రచారం చేస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పలు వాహనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. గెలవరు అనే భయంతోనే టీఆర్ఎస్ వాళ్లు తమపై దాడులకు పాల్పడుతున్నారని ఈటెల ఆరోపించారు.

మునుగోడు ప్రజల తీర్పుతో చెంప ఛెల్లుమంటుందని, టీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ సమక్షంలోనే దాడులకు పాల్పడ్డారని వెల్లడించారు. టిఆర్ఎస్ కార్యకర్తల దాడిలో 30 మంది బీజేపీ కార్యకర్తలకు పైగా గాయాలయ్యాయని తెలిపారు. తన గన్ మెన్ లు, పీఏలకు కూడా దెబ్బలు తగిలాయని చెప్పారు. దాడిలో 10 నుండి 15 కార్లు కూడా ధ్వంసం అయ్యాయి అన్నారు. కిషన్ రెడ్డితో పాటు తన భార్య జమున ప్రచారాన్ని కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారని విమర్శించారు. మునుగోడులో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.