తెలంగాణలో ప్రారంభమైన ఈసెట్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడిన ప్రవేశ ఈసెట్ ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఈ పరీక్ష మధ్యాహ్నం 12 వరకు ముగుస్తుంది. మరొక సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు కొనసాగుతుంది. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల భద్రతపై అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, ఉదయం పరీక్షకు 14,415 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం పరీక్షకు 13,600 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు పరీక్షలు నిర్వహిస్తున్న జేఎన్టీయూ అధికారులు తెలిపారు.
తెలంగాణలో 56, ఏపీలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మాస్క్, శానిటైజర్ తప్పనిసరి చేశామని, పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరిస్తామని అధికారులు ఇదివరకే స్పష్టం చేశారు. కాగా, కోవిడ్ కారణంగా వాయిదాపడిన ఈసెట్, వైరస్ విజృంభణ అనంతరం నిర్వహిస్తున్న తొలి కామన్ ఎంట్రన్స్ టెస్టు కావడం గమనార్హం. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులకు బీటెక్ సెకండియర్లో ప్రవేశాల కోసం ఈసెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/