కొవిషీల్డ్ బూస్టర్ డోసు ధరలను సవరించిన సీరం

ధర రూ.600 నుంచి రూ.225కి తగ్గింపు

న్యూఢిల్లీ : దేశంలోని 18 ఏళ్లు, అంతకు పైబడినవారికి కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు, 60 ఏళ్లకు పైబడినవారికి కేంద్రమే ఉచితంగా బూస్టర్ డోసు ఇస్తోంది. 18, అంతకు పైబడిన వారికి మాత్రం ప్రైవేటు కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల్లో బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఒక బూస్టర్ డోసు ధర రూ.600 అని నిన్న ప్రకటించింది.

అయితే, ధర మరీ ఎక్కువన్న అభిప్రాయాలు వినిపించడంతో, సీరం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంది. దీనిపై సీరం అధినేత అదార్ పూనావాలా స్పందించారు. ప్రైవేటు ఆసుపత్రులకు అందించే కొవిషీల్డ్ బూస్టర్ డోసు ధరలను సవరించామని వెల్లడించారు. ఒక డోసు ధర రూ.600 నుంచి రూ.225కి తగ్గించామని తెలిపారు. 18 ఏళ్లకు పైబడిన వారందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయాన్ని మరోసారి అభినందిస్తున్నామని పూనావాలా పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/