పాలకుర్తి నియోజకవర్గంలో బతుకమ్మ చీరలను పంపిణి చేసిన మంత్రి ఎర్రబెల్లి

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బతుకమ్మ చీరలను పంపిణి చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల పండుగలను ప్రభుత్వమే చేసే కొత్త సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చారని, బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా ఇంట్లో పెద్దకొడుకుగా సీఎం కేసీఆర్‌ ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది 24 డిజైన్లు 10 రకాల ఆకర్షణీయమైన రంగుల్లో మొత్తం 240 రకాల దారపు పోగుల అంచులతో చీరలు రూపొందించామన్నారు. దీనికోసం ప్రభుత్వం రూ.339.73 కోట్ల ఖర్చు చేసిందని తెలిపారు. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా అమలవడం లేదని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గంలో రూ.3.70 కోట్ల విలువైన లక్షా 9 వేల 775 చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి మండల కేంద్రాల్లో మంత్రి చీరల పంపిణి చేసారు.