అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్న బండి సంజ‌య్‌ను ఏమ‌నాలి : ఎర్ర‌బెల్లి

ఉపాధి హామీ నిధులపై చ‌ర్చ‌కు రావాల‌ని డిమాండ్


హైదరాబాద్: మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పై విమర్శలు కురిపించారు. బండి సంజ‌య్ అబ‌ద్ధాలు చెప్ప‌డం మానుకోవాల‌ని, వాస్త‌వాలు మాట్లాడ‌డం నేర్చుకోవాల‌ని ద‌యాక‌ర్ రావు అన్నారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ప్ర‌జ‌లు ప్రశాంతంగా ఉన్నార‌ని, పాద‌యాత్ర చేస్తూ ప్ర‌జ‌ల‌కు బండి సంజ‌య్ ఎందుకు అబ‌ద్ధాలు చెబుతున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలంగాణలో సంక్షేమ ప‌థ‌కాలు అద్భుతంగా ఉన్నాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వ‌మే చెబుతోంద‌ని ఆయ‌న అన్నారు.

క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో ఉపాధి హామీ ప‌థ‌కం ఎలా కొన‌సాగుతుందో, తెలంగాణ‌లో ఎలా కొన‌సాగుతుందో చ‌ర్చించేందుకు త‌మ వ‌ద్ద‌కు రావాల‌ని బండి సంజ‌య్‌కు స‌వాలు విసిరారు. ఉపాధి హామీ నిధులు మూడు నెల‌ల నుంచి ఇవ్వ‌ట్లేద‌ని అంటున్నార‌ని, ల‌బ్ధిదారుల‌కు కేంద్ర ప్ర‌భుత్వ‌మే నేరుగా బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బులు వేస్తుంద‌ని అన్నారు. దీనిపై తెలంగాణ ప్ర‌భుత్వంపై అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్న బండి సంజ‌య్‌ను ఏమ‌నాల‌ని ఆయ‌న నిల‌దీశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/