ఇకపై ఈ గందరగోళం ఉండదు
అందుకే ఈ రెండు జిల్లాల పేర్లను మార్చుతున్నాం.. మంత్రి ఎర్రబెల్లి
వరంగల్: సీఎం కెసిఆర్ వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనలపై హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. వరంగల్ను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కాళేశ్వరం దేవాదుల ద్వారా వరంగల్ను సస్యశ్యామలం చేశారని అన్నారు.
దేవాదుల ద్వారా ఆయా ప్రాంతాల్లో నీటి కొరతను తీర్చేందుకు ప్రణాళికలు రూపొందించారని ఆయన చెప్పారు. అంతేగాక, వరంగల్కు సీఎం డెంటల్ మెడికల్ కాలేజీని మంజూరు చేశారని, ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. వరంగల్ అర్బన్, రూరల్ అంటూ గందరగోళం లేకుండా ఆ జిల్లాల పేర్లను మార్చుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, వట్టి మాటలు చెబుతూ ప్రజలను ఆ పార్టీ నేతలు మోసం చేస్తున్నారని ఆరోపించారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/