సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..ఒకపై అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేటు..

కరోనా తర్వాత సినీ ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లడం చాల వరకు తగ్గించారు. ఓటిటి కి అలవాటు పడి కొంతమంది థియేటర్స్ కు వెళ్లడం మానేస్తే..మరికొంతమంది టికెట్ ధరలు చూసి వెళ్లడం మానేశారు. గతంలో కంటే ఎక్కువగా టికెట్ ధరలు పెరగడం , పెద్ద హీరోల సినిమా వస్తే దానికి రెట్టింపు అవ్వడం తో థియేటర్స్ వైపు చూడడమే మానేశారు. సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ థియేటర్స్ ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.

దీంతో షోస్ నడపలేక థియేటర్స్ ను క్లోజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నిర్మాతలంతా ఒకేతాటిపై నిలబడాలని డిసైడ్ అయ్యారు. ఇకపై అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధర ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్నీ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఇక మీదట అన్ని సినిమాలకు ఒకే ధర ఉంటుందని వెల్లడించాడు. కాకపోతే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన స్టార్‌ హీరోల సినిమాలకు మాత్రం ఇందుకు మినహాయింపు అని స్పష్టం చేశాడు.

బుధవారం నాడు జరిగిన థాంక్యూ చిత్ర ప్రెస్‌మీట్‌లో దిల్‌ రాజు మాట్లాడుతూ.. స్టార్‌ హీరోల హై బడ్జెట్‌ చిత్రాలను మినహాయిస్తే అన్ని సినిమాలకు టికెట్‌ రేట్లు ఒకేలా ఉంటాయన్నాడు. మేజర్‌, విక్రమ్‌ సినిమాలకు ఉన్న రేట్లే అన్నింటికీ ఉంటాయని తెలిపాడు. హైదరాబాద్‌, వైజాగ్‌లాంటి పట్టణాల్లో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో జీఎస్టీ కలిపి రూ.150, మల్టీప్లెక్స్‌లో రూ.200 ఉంటాయని పేర్కొన్నాడు. నిర్మాతలందరం కలిసి చర్చించాకే టికెట్‌ రేట్లపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. మరి ఇప్పుడైనా ప్రేక్షకులు థియేటర్స్ కు అలవాటు పడతారో లేదో చూడాలి.