ఒక్క ట్వీట్‌తో రూ. 1.10 లక్షల కోట్లు పోగొట్టుకున్న ఎలాన్ మస్క్!

ట్వీట్ వైరల్ కావడంతో టెస్లాపై ప్రభావం

టెక్సాస్‌: టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ గతంలో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వేల కోట్లను పోగొట్టుకున్న ఆయన, తాజాగా మరో ట్వీట్ చేయగా, అమెరికా మార్కెట్లో టెస్లా ఈక్విటీ విలువ ఏకంగా 8.6 శాతం పడిపోయింది. దీంతో ఎలాన్ మస్క్ నికర ఆస్తి విలువ రూ. 1.10 లక్షల కోట్లు (సుమారు 15.2 బిలియన్ డాలర్లు) పడిపోయింది.

ఇటీవలి కాలంలో బిట్ కాయిన్ విలువ రోజురోజుకూ పెరుగుతూ, 50 వేల డాలర్లకు చేరగా, తన ట్విట్టర్ ఖాతాలో స్పందించిన మస్క్, ‘బిట్ కాయిన్, ఎథర్ క్రిప్టో కరెన్సీ ధర ఎక్కువగా కనిపిస్తోంది’ అని ట్వీట్ చేశారు. ఎలాన్ మస్క్ ఇటీవల బిట్ కాయిన్ లో భారీ పెట్టుబడులు పెట్టారన్న సంగతి తెలిసిందే. తాజా ట్వీట్ వైరల్ కాగా, టెస్లా ఈక్విటీ వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. దీంతో సంస్థ ఈక్విటీ విలువ పడిపోయింది. త్వరలో బిట్ కాయిన్ పేమెంట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్న మస్క్, 1.5 బిలియన్ డాలర్ల విలువైన కాయిన్లను కొనుగోలు చేశారు కూడా.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/