విజయవాడ సూర్యారావుపేటలో ఎలక్ట్రికల్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి
ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లోకి వచ్చాయని వాహనదారులు ఎంతో సంతోషపడ్డారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. ఎందుకంటే వరుసపెట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు పేలుతూ ఉన్నాయి. రీసెంట్ గా తెలంగాణ లోని నిజామాబాద్లో ఒక ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరో ముగ్గురికి తీవ్రంగా గాయలయ్యాయి. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ చార్జింగ్ పెట్టి పడుకున్న సమయంలో ఒక్కసారిగా ఇది బ్యాటరీ పేలింది. ఈ ఘటన ఇంకా మరచిపోకముందే విజయవాడ లో మరో ఎలక్ట్రికల్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందారు.
సూర్యారావుపేటలో ఎలక్ట్రికల్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా… మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. శివకుమార్ అనే వ్యక్తి… నిన్ననే కొత్త ఎలక్ట్రికల్ బైక్ కొనుగోలు చేశాడని బంధువులు చెపుతున్నారు. ఇంట్లోని బెడ్రూమ్లో బైక్ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టగా… తెల్లవారుజామున బ్యాటరీ పేలి ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. శివకుమార్తో పాటు భార్య, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లిన స్థానికులు… వారిని రక్షించే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా శివకుమార్ మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.