టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం : ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత

చిత్రసీమలో వరుస విషాదాలు ఆగడం లేదు. ప్రతి రోజు చిత్రసీమకు సంబదించిన వ్యక్తులు మరణిస్తూనే ఉన్నారు. నిన్న ప్రముఖ నటుడు , దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి మాతృమూర్తి మరణవార్త అందర్నీ శోకసంద్రంలో పడేయగా..ఈరోజు ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌రాజు (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన.. నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 1:30 నిమిషాలకు ఆయన మరణించారు. ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. గౌతమ్‌ రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

గౌతమ్ రాజు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. సుమారు 800 చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసి సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా తెలుగులో తెరకెక్కిన ఎన్నో హిట్‌ చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా బాధ్యతలు చేసారు. ప్రముఖ నటులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ నటించిన ఎన్నో సినిమాలకు ఆయన పనిచేశారు. ‘ఆది’, ‘ఖైదీ నెంబర్‌ 150’, ‘గబ్బర్‌సింగ్‌’, ‘కిక్‌’, ‘రేసుగుర్రం’, ‘గోపాల గోపాల’, ‘అదుర్స్‌’, ‘బలుపు’, ‘రచ్చ’, ‘ఊసరవెల్లి’, ‘బద్రీనాథ్’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘కాటమరాయుడు’ తదితర ప్రాజెక్ట్‌లతో ఆయన సినీ ప్రేక్షకుడి మది గెలుచుకున్నారు. ‘చట్టానికి కళ్లులేవు’ సినిమాతో గౌతమ్‌రాజు ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. ‘ఆది’ చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా నంది అవార్డును అందుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చిత్రసీమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ , ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.