ఈడీ కస్టడీకి కార్వీ సంస్థ చైర్మన్ పార్థసారథి

4 రోజుల కస్టడీ విధించిన కోర్టు

హైదరాబాద్: దాదాపు రూ.2 వేల కోట్ల మేర సెక్యూరిటీల కుంభకోణంలో కార్వీ సంస్థ సీఎండీ పార్థసారథి, ఆ సంస్థ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ జి.హరికృష్ణలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడం తెలిసిందే. పెట్టుబడిదారుల షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి భారీగా రుణాలు తీసుకున్నారని, మనీలాండరింగ్ కు పాల్పడ్డారని పార్థసారథిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. రుణాల ద్వారా సేకరించిన మొత్తాన్ని షెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఈడీ ప్రాథమిక దర్యాప్తుల్లో వెల్లడైంది.

ఈ నేపథ్యంలో, కార్వీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి, సీఎఫ్ఓ హరికృష్ణలను తమ కస్టడీకి అప్పగించాలన్న ఈడీ విజ్ఞప్తికి తాజాగా కోర్టు సమ్మతించింది. వారిద్దరినీ 4 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పార్థసారథిని ఈడీ అధికారులు బెంగళూరులో అదుపులోకి తీసుకుని హైదరాబాదు, చంచల్ గూడ జైలుకు తరలించారు. నేడు కోర్టు తీర్పు అనుసరించి ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను చంచల్ గూడ జైలు నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/