మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ఈడీ షాక్‌..

అనిల్‌ దేశ్‌ముఖ్‌ పీఏ, వ్యక్తిగత కార్యదర్శి అరెస్ట్‌

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ కు షాకిచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇచ్చి, ఆయనను విచారిస్తోంది. ముకేశ్ అంబానీ ఇంటి ముందు పెట్టిన కారు బాంబు కేసులో.. మాజీ హోం మంత్రిపై ముంబై మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో రెస్టారెంట్లు, బార్ల నుంచి రూ.100 కోట్ల వసూళ్లు చేయాల్సిందిగా అనిల్ టార్గెట్ పెట్టారని ఆయన అప్పట్లో ఆరోపించారు.

ఆ కేసులోనే ఈడీ తాజాగా అనిల్ కు నోటీసులిచ్చింది. ఆయన వ్యక్తిగత సహాయకుడు కుందన్ షిండే, వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ పలాండేను అరెస్ట్ చేశారు. ఇవ్వాళ వారిని హవాలా డబ్బు నివారణ చట్టం (పీఎంఎల్ఏ) ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. కాగా, అంతకుముందు శుక్రవారం నాగ్ పూర్ లోని అనిల్ దేశ్ ముఖ్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ముంబైలోని వర్లి, మలబార్ హిల్ లోని ఇళ్లపైనా దాడులు చేశారు. 12 బార్ల యజమానుల దగ్గర్నుంచి దాదాపు రూ.4 కోట్ల దాకా డబ్బును వసూలు చేసినట్టు తెలుస్తోంది. వారి నుంచి వసూలు చేసిన డబ్బును సచిన్ వాజే.. వేరే రాష్ట్రాల్లో ఉన్న బూటకపు సంస్థల ద్వారా అనిల్ దేశ్ ముఖ్ కు బదిలీ చేసినట్టు సమాచారం. ఈ ఆధారాలతో ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశముందని చెబుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/