హైదరాబాద్లో 8 ప్రాంతాల్లో ఈడీ సోదాలు
హైదరాబాద్ః నేడు ఉదయం హైదరాబాద్లో ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. వీరిద్దరిపై విదేశాలకు నిధులు మళ్లించినట్లు ఈడీ కేసు నమోదుచేసింది. ఈ నేపథ్యంలో బోయిన్పల్లిలోని మాధవరెడ్డి, ఐఎస్ సదన్లోని చీకొటి ప్రవీణ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. వీరు నేపాల్లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈడీ అధికారులు ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. 8 బృందాలుగా ఏర్పడిన అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. పలు పత్రాలతో పాటు కంప్యూటర్లు, ల్యాప్ టాప్ , చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. శ్రీలంకకు చెందిన క్యాసినో సంస్ధలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న ప్రవీణ్, మాధవ రెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురిని క్యాసినో ఆడేందుకు తీసుకెళ్తున్నారు.
కాగా, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖ నుంచి నుంచి పేకాట రాయుళ్లను ప్రత్యేక విమానాలలో తీసుకెళ్లి క్యాసినో ఆడిస్తున్నట్లు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా వెస్ట్ బెంగాల్ లోని బాగ్ డోగ్ర ఎయిర్పోర్టుకు కస్టమర్లను తరలించి.. అటునుంచి నేపాల్లోని హోటల్ మెచి క్రౌన్లో ఆల్ ఇన్ క్యాసినో పేరుతో ఈవెంట్ నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. ఈ ఈవెంట్లో టాలీవుడ్, బాలీవుడ్, నేపాలీ డ్యాన్సర్లతో కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేయించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/