నిజామాబాద్‌ జిల్లాలో భూకంపం..

నిజామాబాద్‌ జిల్లాలో ఆదివారం భూకంపం ఒక్కసారిగా కలకలం రేపింది. నిజామాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం భూకంపం చోటు చేసుకుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కూల్‌పై 3.1గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో.. భయంతో ఇళ్లల్లోని ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. నిజామాబాద్‌కి 120 కిలోమీటర్ల దూరంలో, ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో భూ ప్రకంపనాలు ఎక్కువగా నమోదౌతున్నాయి. భూకంపాలు ఎందుకు నమోదౌతున్నాయనే విషయమై అధికారులు పరిశోధనలు చేస్తున్నారు.

నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా సంభవించిన భూప్రకంపనల్లో ఎలాంటి ప్రమాదాలు జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఎలాంటి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. స్పల్పంగానే భూమి కంపించడంతో ప్రమాదం తప్పిందని అంటున్నారు. కాగా తెలంగాణలో భూప్రకంపనలు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 6న జహీరాబాద్ మండలం బిలాపూర్‌లో భూమి కంపించింది. ఇక 2021 అక్టోబర్ 21న మంచిర్యాల, కరీంనగర్, రామగుండంలో భూప్రకంపనలు సంభవించగా.. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0గా నమోదైంది.