ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు
ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు..అధికారులు
న్యూఢిల్లీ: ఢిల్లీలో శుక్రవారం రాత్రి స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. హర్యానలోని రోహతక్లో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. రాత్రి 9:08 గంటల సమయంలో మొదటిసారిగా భూమి కంపించగా ఢిల్లీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మళ్లీ 10 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించడంతో.. జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. మొదటిసారి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు కాగా, రెండోసారి 2.9గా నమోదైంది. భూకంపం కేంద్రీకృతమైన రోహతక్ ఢిల్లీకి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే నివాసాల్లోని టేబుల్స్, మంచాలు, సీలింగ్ ఫ్యాన్లు కాసేపు కదిలినట్లు స్థానికులు తెలిపారు. భూప్రకంపనలు 7 నుంచి 8 సెకన్ల పాటు సంభవించాయని చెప్పారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/