3.8 తీవ్రతతో అరుణాచల్‌ ప్రదేశ్‌లో భూకంపం

Earthquake

ఇటానగర్ః ఈరోజు ఉదయం 7 గంటలకు అరుణాచల్‌ప్రదేశ్‌లోని బాసర్‌లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. ఉదయం 7.01 గంటలకు బాసర్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. బాసర్‌కు 58 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని పేర్కొన్నది.

గోదావరి జన్మస్థలమైన నాసిక్‌లో తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయిందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. నాసిక్‌కు పశ్చిమాన 89 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ ఉపరితలం కింది టెక్టానిక్‌ ప్లేట్ల కదలిక వల్ల భూమికి దిగువన 5 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని పేర్కొన్నది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం తెలియరాలేదని అధికారులు చెప్పారు.

కాగా, అంతకుముందు కూడా గడ్చిరోలి జిల్లాలో భూకంపం వచ్చింది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో స్వల్పంగా భూమికంపించింది. ఇక ఆగస్టు 16న రాత్రి 8.58 గంటల తర్వాత స్వల్ప వ్యవధిలోనే (రాత్రి 9.34 గంటలు, రాత్రి 9.42 గంటలకు) నాసిక్‌ జిల్లాలో మూడుసార్లు భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 3.4, 2.1, 1.9గా నమోదయ్యాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/