దుర్గగుడి వెండి సింహాల చోరీ కేసులో పోలీసుల పురోగతి

పశ్చిమగోదావరి జిల్లా పోలీసుల అదుపులో నిందితుడు

విజయవాడ: బెజవాడ దుర్గమ్మ వెండి రథంపై ఉండే మూడు సింహాల ప్రతిమల మాయం కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఈ ప్రతిమలు మాయమైనట్టు గతేడాది సెప్టెంబరులో గుర్తించారు. విచారణలో భాగంగా ఆలయ సిబ్బంది, దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో పనిచేసే ఇతర రాష్ట్రాల కూలీలతోపాటు ఇలాంటి చోరీలకు పాల్పడే 40 మందిని విచారించినప్పటికీ ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఎట్టకేలకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్థుడే ఈ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు.

దొంగతనాల కేసులో ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బాలకృష్ణను అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా దుర్గమ్మ వెండి సింహాల ప్రతిమల విషయం వెలుగు చూసింది. వాటిని తానే అపహరించినట్టు బాలకృష్ణ అంగీకరించాడు. దొంగిలించిన ప్రతిమలను అతడు తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన ఓ బంగారు వ్యాపారికి విక్రయించాడు. దీంతో అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలకృష్ణ నుంచి కొనుగోలు చేసిన 16 కిలోల బరువున్న ప్రతిమలను అతడు కరిగించాడని చెబుతునప్పటికీ పోలీసులు మాత్రం నిర్ధారించలేదు. నిందితుడిని ప్రస్తుతం విజయవాడ పోలీసులు విచారిస్తున్నారని, రెండు మూడు రోజుల్లో అతడి అరెస్ట్‌ను చూపిస్తారన్న ప్రచారం జరుగుతోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/