పుట్టిన రోజు నాడే ప్రమాదానికి గురైన డీఎస్

రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ ప్రమాదానికి గురయ్యారు. అది కూడా పుట్టిన రోజు నాడే ఆయన ప్రమాదానికి గురి కావడం అందర్నీ షాక్ లో పడేసింది. సోమవారం ధర్మపురి శ్రీనివాస్‌ పుట్టిన రోజు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో తన నివాసంలో పూజా కార్య క్రమాలు నిర్వహించి , బయటకు వస్తున్న క్రమంలో ఆయన కాలుజారి పడ్డారు. దీంతో ఆయన ఎడమ భుజం ఎముక ఫ్రాక్చర్ అయింది.

ప్రమాదానికి గురి కాగానే కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే హాస్పటల్ కు తరలించారు. అక్కడ వైద్యులు ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే తీసి భుజానికి ఫ్రాక్చర్‌ అయినట్లు గుర్తించారు. నాలుగైదు రోజుల్లో శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు చెప్పడంతో ఇంటికి తీసుకువచ్చామని డీఎస్‌ కుమారుడు, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ తెలిపారు.