గంజాయి మత్తులో ఆసిఫ్నగర్లో యువకుడు పోలీసు వాహనంపైకి ఎక్కి నానా హంగామా

హైదరాబాద్ ఆసిఫ్నగర్లో సోమవారం అర్థరాత్రి గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. జిర్రా ప్రాంతంలోని రాయల్సీ హోటల్ దగ్గర గంజాయి మత్తులో యువకులు హల్‌చల్‌ చేశారు. నడిరోడ్డుపై వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగించారు. వాహనదారుల పైకి రాళ్ళూ విసరడం , అడ్డుపడడం వంటివి చేసి హంగామా సృష్టించారు. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ చేరుకొని అజయ్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే మత్తులో ఉన్న యువకుడు పోలీసు వాహనంపైకి ఎక్కి నానా హంగామా చేసాడు. పోలీసు వాహనంతోపాటు ఇతర వాహనాల అద్దాలు పగులగొట్టారు. స్థానికుల సహాయంతో గంజాయి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేశారు.

ఈ క్రమంలో కొందరు తప్పించుకోగా.. అజయ్‌ అనే యవకుడిని అసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. గంజాయి తాగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గత కొంతకాలంగా హైదరాబాద్ లో గంజాయి విక్రయం బాగా జరుగుతుంది. మైనర్ బాలురులు సైతం ఈ గంజాయి మత్తులో ఊగిపోతున్నారు. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ దీనికి బానిసలవుతున్నారు. పోలీసులు సైతం గంజాయి ని తరలిస్తున్న వారిపై నిఘా పెట్టినప్పటికీ గంజాయి ని మాత్రం నగరంలో కంట్రోల్ చేయలేకపోతున్నారు.