డ్రగ్స్ కేసు : ముగిసిన రకుల్ ఈడీ విచారణ
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణను ప్రారంభించిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ చట్టం కింద ఈ కేసులో ఈడీ సినీ రంగానికి చెందిన 12 మంది ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పూరి జగన్నాధ్ , ఛార్మి లను విచారించి వారి నుండి కీలక సమాచారం రాబట్టగా..ఈరోజు నటి రకుల్ ప్రీతి సింగ్ ను దాదాపు ఏడు గంటలపాటు విచారించారు.
మనీ లాండరింగ్ కోణంలో ఆమె బ్యాంక్ ఖాతాలను ఈడీ అధికారులు పరిశీలించారు. ఆమె వ్యక్తిగత లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. 2016లో ఎఫ్ క్లబ్లో నిర్వహించిన ఓ పార్టీలో రకుల్ పాల్గొన్నారు. ఆ పార్టీలో పాల్గొన్న కెల్విన్ విదేశాలకు డబ్బును తరలించినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ క్లబ్లో డ్రగ్స్ కొనుగోళ్లు జరిగినట్లు కెల్విన్ నుంచి ప్రాథమికంగా సేకరించిన సమాచారం కోణంలోనే దర్యాప్తు కొనసాగింది. ఆ పార్టీకి వచ్చిన రకుల్ మేనేజర్ను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. దిల్లీ, ముంబయిలో ఉన్న రకుల్ ఖాతాల్లో జరిగిన లావాదేవీలు, యూపీఐ లావాదేవీలపై ప్రశ్నించారు. కెల్విన్కు మెసేజ్లు ఏమైనా పంపారా అనే కోణంలో ఈడీ అధికారులు ఆరా తీశారు. ఈ నెల 13 న నవదీప్ ను విచారించనున్నారు. ఆయనను విచారించిన తర్వాత మరిన్ని రకుల్ కు సంబంధించి విషయాలు బయటకు తెలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.