ద్రౌపదీ ముర్మును గెలుపించుకోవాల్సిన అవసరం ఉంది – సీఎం జగన్
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము నేడు ఏపీలో పర్యటించారు. ఈ మేరకు సీఎం జగన్ తో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముర్మును జగన్ దంపతులు సన్మానించారు. ముర్ము వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ..రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు తొలిసారి అవకాశం లభించింది. వైఎస్సార్సీపీ మొదటి నుంచి సామాజిక న్యాయం వైపే ఉంది. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన ప్రభుత్వం మనది. మనమంతా ముర్ముకే ఓటేసి గెలిపించుకోవాలి. ఏ ఒక్క ఓటు వృథా కాకుండా చూసుకోవాలి’అని సీఎం జగన్ అన్నారు.
అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రధాని నరేంద్ర మోడీ తరఫున సీఎం వైఎస్ జగన్కు ధన్యవాదాలు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైఎస్సార్సీపీ మద్దతు పలకడం సంతోషం. అందరితో చర్చించాకే ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించాము. రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి ట్రైబల్ మహిళకు అవకాశం లభించింది. పార్టీలకు అతీతంగా ముర్ముకు అందరం మద్దతు పలకాలి’’ అని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం మధ్యాహ్నం ఏపీకి చేరుకున్నారు ద్రౌపది ముర్ము. అనంతరం ద్రౌపది ముర్ము.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్టేజీపై సీఎం వైఎస్ జగన్.. ద్రౌపది ముర్ముకు పుష్ఫగుచ్చం అందించి శాలువతో సత్కరించారు.