ఆదిలాబాద్ జిల్లాలో జంట హత్యలు

వివాహేతర సంబంధమే కారణమని అనుమానం

suside
double-murders-in-adilabad-create-sensation

గుడిహత్నూర్‌ః ఆదిలాబాద్ జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గుడిహత్నూరు మండలంలోని సీతాగోంది శివారులో యువతీ, యువకుల మృతదేహాలు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వెళ్లిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. వీరిని ఆదిలాబాద్‌లోని భుక్తాపూర్‌కు చెందిన రెహమాన్ (20), కేఆర్‌కే నగర్‌కు చెందిన 28 ఏళ్ల అశ్వినిగా గుర్తించారు.

వివాహమై ఇద్దరు పిల్లలున్న అశ్విని భర్తతో విడిపోయి పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో రెహమాన్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. శుక్రవారం వీరిద్దరూ ఆదిలాబాద్ నుంచి సీతాగోందిలోని స్థానిక పంటపొలంలోకి బైక్‌పై వెళ్తున్నట్టుగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలు లభ్యమయ్యాయి. ఆ తర్వాత వీరిద్దరూ హత్యకు గురయ్యారు. వారిని తలపై బండరాయితో మోది హతమార్చినట్టు అక్కడున్న ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. అశ్విని తరపు బంధువులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.