భారీ విజయోత్సవానికి సిద్ధమవుతున్నాం..ట్రంప్‌

ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది

trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ గెలుపు లాంఛనమే అని ట్రంప్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. శ్వేతసౌధంలో ఆయన దాదాపు 250 మంది పార్టీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘అధ్యక్ష ఎన్నికల్లో మేము ఇప్పటికే గెలిచేశాం’  అని అన్నారు. తాము భారీ విజయోత్సవానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోందని, గెలుపు సంబరాలకు రిపబ్లికన్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు.

జార్జియా, నార్త్ కరోలెనా రాష్ట్రాల్లోనూ గెలవనున్నామని తెలిపారు. భారీ మద్దతు ఇచ్చినందుకు అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. తాము అతిపెద్ద విజయాన్ని సాధించబోతున్నామని చెప్పారు. రికార్డు స్థాయిలో తమకు ఓట్లు పడ్డాయని, మిచిగాన్‌లోనూ భారీ విజయం సాధించామని తెలిపారు.

ఎన్నికల ఫలితాలను డెమోక్రాట్లు తారుమారు చేయాలని చూస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. డెమోక్రాట్ల కుట్రను భగ్నం చేస్తామని, కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. సమయం గడిచిపోయినప్పటికీ ఓటింగ్ కూడా ఇంకా కొనసాగడంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. పోలింగ్ ఆపాలని సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని ప్రకటించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/