ట్రంప్ జూనియర్ కు కరోనా పాజిటివ్
లక్షణాలు లేవన్న ట్రంప్ అధికార ప్రతినిధి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో మరొకరు కరోనా బారినపడ్డారు. ఇప్పటికే ఆయన కుటుంబంలోని అందరూ ఈ మహమ్మారి బారినపడి కోలుకున్నారు. తాజాగా, ఇప్పుడు ఆయన పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్కు వైరస్ సంక్రమించింది. ఈ విషయాన్ని ట్రంప్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ట్రంప్ జూనియర్ కు కరోనా సోకిందని, ప్రస్తుతం ఆయన క్వారంటైన్లో ఉన్నారని తెలిపారు. అయితే, ఆయనలో ఎలాంటి లక్షణాలు లేవన్నారు. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం హోం క్వారంటైన్లో ఉండాలన్న వైద్యుల సూచనతో ప్రస్తుతం ఆయన క్వారంటైన్లో ఉన్నట్టు చెప్పారు.
కాగా, ఇటీవల అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాస భవనమైన వైట్హౌస్లో పలువురు ఉద్యోగులు కూడా కరోనా బారినపడ్డారు. తాజాగా, నిన్న ట్రంప్ న్యాయవాది రూడీ గియులియాని కుమారుడు ఆండ్రూ గియులియాని కూడా కరోనా వైరస్ బారినపడ్డారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/