సైనాను ఎన్నడూ విస్మరించలేదు
జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ను ఎప్పుడూ విస్మరించలేదు. సైనా నా అకాడమీని వీడుతుంటే అత్యంత సన్నిహితమైన వ్యక్తి దూరమైనట్టు అనిపించింది అని జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. గోపీచంద్పై ప్రముఖ క్రీడా జర్నలిస్ట్ బోరియా మజుందార్ ‘డ్రీమ్స్ ఆఫ్ ఎ బిలియన్: ఇండియా అండ్ ద ఒలింపిక్ గేమ్స్’ అనే పుస్తకం రాస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గోపిచంద్.. ప్రియ శిష్యురాలు సైనా వివాదాన్ని మజుందార్తో పంచుకున్నారు. ‘2014లో సైనా అకాడమీని వీడుతుంటే.. అత్యంత సన్నిహితమైన వ్యక్తి దూరమైనట్టు అనిపించింది. వెళ్లొద్దని అంతకుముందే చాలా బతిమిలాడా. ఇతరుల ప్రభావంతో ఆమె అప్పటికే వెళ్లడానికి సిద్దమయింది. ఇక నేను ఆపలేకపోయా. తను వెళ్లడం ఇద్దరికీ మంచిది కాదని తెలుసు. ఆ సమయంలో వేరే క్రీడాకారులను చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉండేది. పీవీ సింధు 2012 -2014 కాలంలో అత్యుత్తమంగా రాణించింది. అయినా.. ఎప్పుడూ సైనా నెహ్వాల్ను విస్మరించలేదు’ అని గోపిచంద్ తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/