ఎపిలో ‘స్థానిక’ పోరు..పై చర్చ

-ప్రచారం రోజుల తగ్గింపుపై తర్జనభర్జన

-డబ్బు,మద్యం పంపిణీపై భిన్నవాదనలు

-త్వరలో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

Panchayati Elections

గుంటూరు: త్వరలో జరగబోయే మునిసిపల్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. జిల్లాలో మున్సిపాలిటీలతోపాటు పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్సీపీటీసీల ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. వీటి నిర్వహణకు సంబంధించి ఈ సారి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు జిల్లాలో రాజకీయ నాయకులు, అటు ప్రజా ప్రతినిధుల మద్య చర్చకు తెరలేచింది.

స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబందించి మరో నాలుగు,ఐదు రోజుల్లో వెలువడనున్న కోర్టు తీర్పుకోసం వేచిచూస్తున్న ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సానుకూల సంకేతాలు అందించింది. దీనిపై ఏం జరుగుతుందోనని ఆశావాహాలు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం నెల రోజుల్లో పురపాలక, స్థానిక సంస్థలకు సంబందించి ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయితీ ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తోంది. అయితే వీటిలో ఏ ప్రక్రియను ముందుగా నిర్వహించాలనే దానిపై ముఖ్యమంత్రి వైయస్‌ జగ న్మోహన్‌రెడ్డిని మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలతో చర్చలు జరుపు తున్నారు. అటు తెలుగుదేశం పార్టీలోను, ఇతర రాజకీయ పార్టీలో జోరుగా చర్చ సాగు తోంది.

మొదట మున్సిపాలిటి ఎన్నికలు వస్తాయని లేదు స్థానిక సంస్థల ఎన్నికలే నిర్వహిస్తారనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి తీసుకున్న రిజర్వేషన్ల ఖరారు అంశంపై కోర్టులో అనుకూల తీర్పువస్తే వెనువెంటనే నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది.

ఇలా కాని పక్షంలో ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లను మళ్లీకొత్తగా ఖరారు చేయాల్సిఉంటుంది. అందుకోసం మరికొంత సమయంపట్టే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా రాష్ట్ర క్యాబినెట్‌ ఇటీవల సమావేశమై స్థానిక, పంచాయితీ ఎన్నికల ప్రచారంపై తీసుకున్న కీలక నిర్ణయం రాజకీయ నాయకుల్లో చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా స్థానికులే పోటీకి అర్హులు, ప్రచార సమయం కుందింపు, డబ్బులు, మద్యం పంపిణీకి పాల్పడితే అనర్హత వేటు వంటి నిర్ణయాలపై రాజకీయ పక్షాల నుంచి భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి ప్రచార సమయం బాగా తగ్గిపోనుంది. గతంలో జరిగిన పంచాయితీ సర్పంచ్‌ ఎన్నికల్లో నోటిఫికేషన్‌ విడుదలైనప్పటినుంచి పోలింగ్‌ జరిగే వరకు మధ్యలో 18 నుంచి 20 రోజులు వరకు గడువు ఉండేది. ఈ మధ్యలోనే నామినేషన్ల దాఖలు, పరిశీలన, అభ్యంతరాలు, ఉపసంహరణ వంటి వాటికి ఒక్కొక్కరోజు అవకాశం ఉంది. అప్పట్లో మూడు దశల్లో జిల్లాలోని అన్ని పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎన్నికలకు సంబందించి ఇదే తీరు అమలయ్యింది. ఈసారి సర్పంచ్‌లకు ఏడు రోజులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఐదు రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి గడువుగా నిర్ణయించబోతున్నారు. అంటే దాదాపు 15 రోజులకు పైగా సమయం కుదించబోతున్నారు.

దీనిపై మెజార్టీ అధికార వైకాపా శ్రేణుల నుంచి సానుకూలత వ్యక్తమవుతుండగా తేదేపా, ఇతర పార్టీల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఎన్నికల ప్రచార సమయం తగ్గడం వల్ల ఓటర్లందరనీ కలుసుకొనే అవకాశం చాలా తక్కువగా ఉందని తేదేపా వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. మరోవైపు నామినేషన్‌దాఖలు, అభ్యంతరాలు వ్యక్తం చేయటం, ఉపసంహరణ వంటి వాటికి ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల పదవులకు స్థానికేతరను పోటీ చేయరాదనే నిబంధన తేదేపా విజయానికి అడ్డుకట్ట వేయటమేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొన్నటి వరకు జడ్పీటీసీ పదవికి సంబందించి జిల్లాలో ఏ మండలం నుంచైనా పోటీచేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో అది ఉండదు.

ఉదాః- జిల్లాపరిషత్‌ చైర్మన్‌ పదవిని ఆశించే ఒక నాయకుడు తాను నివాసం ఉంటున్న మండలంలో రిజర్వేషన్‌ బట్టి పోటీచేసే అవకాశం లేకపోవటంతో తన సామాజిక వర్గానికి రిజర్వయినా ఇతర స్థానం నుంచి పోటీచేసే అవకాశాన్ని కోల్పోతోరు. ఇది ఇలా ఉండగా రాజకీయ నాయకుల్లో కొంత మంది నిజాయితీపరులు ఖర్చులు తలుచుకొని మనకెందుకులే అంటూ వెనక్కి తగ్గేవారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులకు అడ్డుకట్ట పడేలా అధికారయంత్రాంగం సన్నర్థం కాబోతుంది. మద్యం, డబ్బువంటి పంపిణీ చేస్తే పోటీలో అనర్హులుగా ప్రకటిస్తారు.

ఈ ఆంక్షలు అధికార పార్టీకి కలిసివచ్చే అంశమేనని తేదేపా వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు మధ్యం,డబ్బు వంటివి పంపిణీ చేసినా చూసిచూడనట్లుగా ఒదిలేసే అధికార యంత్రాంగం ప్రతిపక్షాల చర్యలకు మాత్రం అడ్డుకట్ట వేసేందుకు ఇటువంటి ఆలోచనలు చేసినట్లు కొంతమంది విమర్శిస్తున్నారు.

ప్రకృతి వైపరిత్యాలు, నీటి యద్దడి సమయాల్లో మాత్రం పంచాయితీ తీర్మానాలు లేకుండానే నిర్ణయాలు తీసునే అధికారాన్ని సర్పంచ్‌లకు అప్పజెప్పాలనే నిర్ణయంపై అన్ని రాజకీయపార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించడం శుభపరిణామమని భావిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/