బైకును ఢీ కొట్టిన దిగ్విజయ్‌ సింగ్‌ కారు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్ కారు అతివేగంతో ఓ బైకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రాజ్‌గఢ్‌ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన బైకర్‌ను మెరుగైన చికిత్స కోసం భోఫాల్‌కు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే..

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌ పురోహిత్‌ తల్లి చనిపోవడం గురువారం ఉదయం ఆమెకు నివాళులు అర్పించడానికి దిగ్విజయ్‌ సింగ్ కొడాక్య గ్రామానికి వెళ్లారు. నివాళులు అర్పించి అనంతరం ఆయన రాజ్‌గఢ్‌కు బయలుదేరారు. రాజ్‌గఢ్‌కు చేరుకోగానే ఆయన ఫార్చ్యూనర్‌ కారు రోడ్డు క్రాస్‌ చేస్తున్న బైకర్‌ను వేగంగా ఢీకొట్టింది. దీంతో బైకర్‌ రాంబాబు (20) కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దిగ్విజయ్‌ సింగ్‌ డ్రైవర్‌ను అదపులోకి తీసుకున్నారు. కారును సీజ్‌ చేశారు. ప్రమాదం జరగ్గానే దిగ్విజయ్‌ సింగ్‌ కారుదిగి బాధితుడి దగ్గరికి వెళ్లి ఎలా ఉన్నాడనేది ఆరా తీసినట్లు సీసీ కెమెరాల్లో కనిపిస్తుంది.