ఇబ్రహీంపట్నం ఘటనపై స్పందించిన డీహెచ్

మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం

dh-press-meet-on-sterilization-operations-incident-at–ibrahimpatnam-govt-hospital

హైదరాబాద్: ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ఇబ్రహీంపట్నం సివిల్‌ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వికటించి. నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రం ఘటనలో దర్యాప్తునకు ప్రత్యేక కమిటీని నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం అందిచనున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడి లైసెన్సును తాత్కాలికంగా రద్దు చేసి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయడంతో పాటు వారి పిల్లల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు.

“ఇబ్రహీంపట్నంలో నిపుణులైన వైద్యులతోనే మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించాం. నలుగురు మహిళలు తమకు గ్యాస్ట్రో లక్షణాలున్నట్లు చెప్పారు. తగిన చికిత్స అందించినా నలుగురు చనిపోవడం దురదృష్టకరం. మహిళల మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించాం. కు.ని. ఆపరేషన్ చేయించుకున్న 30 మందికీ చికిత్స అందిస్తున్నాం. అందులో ఏడుగురికి పలు ఆరోగ్య సమస్యలు గుర్తించి వారిని అపోలో ఆస్పత్రికి పంపించాం. మిగతా అందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఘటనపై అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నాం.. అని ఆయన తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/