స్పైస్ జెట్ కు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ
న్యూఢిల్లీ : స్పైస్ జెట్ కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. స్పైస్ జెట్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు ఏర్పడుతున్నాయి. గత 18 రోజుల్లో 8 విమానాల్లో సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయి. దీంతో వరుస ఘటనలపై వివరణ ఇవ్వాలని కోరింది. విమానాల భద్రతా ప్రమాణాలు తగ్గిన అంశంపై వివరణ ఇవ్వాలని స్పైజ్జెట్కు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గడిచిన 17 రోజుల్లో స్పైస్జెట్ విమానాల్లో ఆరుసార్లు సాంకేతిక లోపం తలెత్తింది. రెండు రోజుల క్రితం దుబాయ్ వెళ్తున్న విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే. ఫ్యూయల్ ఇండికేటర్ లోపం వల్ల ఆ విమానాన్ని దారి మళ్లించారు. ఇవాళ కూడా చైనా వెళ్లాల్సిన కార్గో విమానాన్ని స్పైస్జెట్ దారి మళ్లించినట్లు తెలుస్తోంది. వెదర్ రేడార్ పనిచేయకపోవడంతో ఆ విమానాన్ని కోల్కతాలో ల్యాండ్ చేశారు.
గత నెల 19 నుంచి స్పైస్జెట్ విమానాల్లో ఆరు దఫాలు సాంకేతిక లోపాలు తలెత్తాయి. జూన్ 19న పాట్నా నుంచి 185 మంది ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్ జెట్ విమానాన్ని నిమిషాల్లోనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. పక్షి ఢీ కొట్టడంతో ఇంజిన్ దెబ్బతిన్నది. అదే రోజు జబల్పూర్-ఢిల్లీ విమానంలో మరో సమస్య తలెత్తింది. గత నెల 24,25 తేదీల్లో రెండు వేర్వేరు విమానాల్లో ఫ్యూజ్లేజ్ డోర్ వార్నింగ్ తలెత్తింది. దీంతో ఆ రెండు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ నెల రెండో తేదీన జబల్పూర్-ఢిల్లీ విమానం క్యాబిన్లో పొగలు వచ్చాయి.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/