అంధకారంలో వందలాది గ్రామాలు
శిబిరాలకు వస్తేనే సాయమంటున్న ప్రభుత్వం
అమరావతి: ఏపి ప్రభుత్వంపై టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. భారీ వర్షాల కారణంగా ఏపిలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. అయితే, శిబిరాలకు వస్తేనే సాయమని ఏపి ప్రభుత్వం చెబుతోందని, దీంతో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ‘గ్రామాల్లో విద్యుత్ తీగలను తాకుతున్న గోదావరి ప్రవాహం, అంధకారంలో వందలాది గ్రామాలు, శిబిరాలకు వస్తేనే సాయమంటున్న ప్రభుత్వం, పిల్లలతో కొండలపైకి ఎక్కి టెంట్లలో ప్రజలు. ఏజెన్సీలో ఆకలి కేకలు. పంట నష్టపోయిన రైతులకు చేయూతనిచ్చి, వరద బాధితులను ఆదుకోవాలంటోన్న చంద్రబాబు నాయుడి మాటలు వినపడుతున్నాయా జగన్?’ అని దేవినేని ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న విషయానికి సంబంధించిన ఓ వీడియోను ఆయన ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/